పాపను చూసేందుకు ఆదివారం ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టేవాడు: వనితా రెడ్డి

బుధవారం, 27 డిశెంబరు 2017 (18:30 IST)
హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన సతీమణి వనితా రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ సందర్భంగా పల ఆధారాలను పోలీసులకు సమర్పించింది. త‌న భ‌ర్త ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో తెలియట్లేదని వనితా రెడ్డి మీడియాతో వెల్లడించింది. మూడున్నరేళ్ల పాటు ఆయనకు దూరంగా వున్నానని..విజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలియదని వనితా రెడ్డి తెలిపింది. 
 
విజయ్ త‌ప్పుల‌ని బ‌య‌ట పెట్ట‌డం కోసం ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను. ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ తనపై క‌క్ష తీర్చుకోవాల‌ని సెల్ఫీ వీడియో తీశాడని వనితా రెడ్డి చెప్పుకొచ్చింది. విజ‌య్ అమ్మానాన్న‌లే తనను ఇలా ఇరికించారని.. పాప మీద విజ‌య్‌కు అంత‌గా ఇష్టం ఉండి ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడు కాదని చెప్పింది. తాను మాట్లాడుతున్న‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియోను మీడియా త‌ప్పుగా వినిపించిందని పేర్కొంది.
 
ఆత్మహత్య చేసుకున్న విజయ్‌ సాయి సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల్ని అతడి భార్య వనితారెడ్డి ఖండించారు. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోలో తన భార్య సహా మరో ఇద్దరి పేర్లు ప్రస్తావించడంతో పోలీసులు వారికి నోటీసులు జారీచేశారు. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిన వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీస్టేషన్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
పోలీసులకు ఆధారాలు సమర్పించిన అనంతరం వనితా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తానెక్కడకీ పారిపోలేదని, తనపై వచ్చిన ఆరోపణల్ని రుజువు చేసుకొనేందుకు ఆధారాలు సేకరణకు సమయం పట్టడంతోనే ఇన్ని రోజులు పోలీసుల ఎదుట హాజరుకాలేదన్నారు. తామిద్దరూ మూడేళ్ల కిందటే విడాకులు తీసుకున్నామని, ఇప్పుడు అతడితో తనకెలాంటి సంబంధంలేదని వనితా రెడ్డి స్పష్టంచేశారు. పాపను చూసేందుకు ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు తననెంతో ఇబ్బందిపెట్టేవాడే తప్ప తానేనాడూ విజయ్‌ను ఇబ్బంది పెట్టలేదని ఆమె వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు