నిన్న తీసుకుంటే నాలుగు రోజుల తరువాత దర్శనం, ఈరోజు తీసుకుంటే రేపటికి దర్శనం, ఏంటబ్బా ఇది?

ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:37 IST)
శ్రీవారి సేవా టిక్కెట్లలో గందరగోళం నెలకొంది. స్లాట్ పద్థతి ప్రకారం టిక్కెట్లను టిటిడి అందజేస్తోంది. మరుసటి రోజు దర్శనానికి ఈరోజు టోకెన్లను పొందాల్సి ఉంటుంది. అయితే టోకెన్లలో గందరగోళం నెలకొని చివరకు శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది.
 
తిరుపతిలోని విష్ణునివాసంలో 24 గంటల పాటు టోకెన్లను టిటిడి అందజేస్తోంది. ఉచిత టోకెన్లతో పాటు 300 రూపాయల టోకెన్లను అందిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు టోకెన్లను పొంది తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
కానీ వారాంతం కావడంతో నిన్న అధికసంఖ్యలో తిరుపతికి భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా రెండవ శనివారం కావడంతో తమిళనాడు రాష్ట్రం నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. నిన్న టోకెన్లను పొందిన భక్తులకు 23, 24 తేదీల్లో దర్సనానికి సంబంధించిన టోకెన్లను అందజేశారు.
 
నిన్న మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు పిల్లలు, వృద్ధులతో గంటల తరబడి వేచి ఉండి టోకెన్లను పొందారు. అయితే ఈరోజు ఉదయం టోకెన్లను పొందిన భక్తులకు రేపు దర్సనాన్ని కేటాయిస్తూ టోకెన్లను అందజేశారు. దీంతో భక్తుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. సర్వర్‌ను టిటిడి సరిగ్గా పెట్టుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విష్ణునివాసం వెనుక వైపు ఉన్న రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. 
 
వెంటనే టోకెన్లను మార్చి తమకు రేపటికి దర్సనభాగ్యం కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. టిటిడి సిబ్బందిని ఇదేంటని ప్రశ్నిస్తే తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ భక్తులు వాపోయారు. భక్తులు ఆందోళన చేసినా టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు