శ్రీవారి భక్తులు త్వరపడండి, వైకుంఠ ద్వార దర్సనానికి టిక్కెట్లు విడుదలవుతున్నాయి, ఎప్పుడంటే..?

బుధవారం, 16 డిశెంబరు 2020 (20:58 IST)
వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్సించుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. వైకుంఠ దర్సనం పుణ్యఫలం అన్నది భక్తుల నమ్మకం. అందుకే ప్రతి యేడాది టిక్కెట్ల కోసం పోటీలు పడుతుంటారు. అయితే కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ టిటిడి టిక్కెట్లను అందించనుంది.
 
వైకుంఠ ద్వార దర్సనానికి అదనంగా 18 వేల టిక్కెట్లను టిటిడి విడుదల చేస్తోంది. వైకుంఠ ఏకాదశి మొదలు పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్సనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది టిటిడి. శ్రీవాణి ట్రస్టు ద్వారా 18 వేల టిక్కెట్ల  జారీ ప్రక్రియను ప్రారంభించనుంది. 
 
ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్సనం ద్వారా రోజుకు 20 వేల టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. సర్వదర్సనం ద్వారా మరో పదివేల టిక్కెట్లను ఈ నెల 24వ తేదీ జారీ చేయనుంది. వీటికి అదనంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదిరోజులకు మరో 18వేల టిక్కెట్లను జారీ చేయాలని టిటిడి నిర్ణయం తీసేసుకుంది.
 
ఈ నెల 25వ తేదీ వైకుంఠ ఏకాదశి, జనవరి 1వ తేదీన వెయ్యి కోట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. మిగిలిన ఎనిమిది రోజుల పాటు రోజుకు రెండువేల చొప్పున శ్రీవాణి ట్రస్ట్ నుంచి జారీ చేయనున్నారు. శ్రీ వాణి ట్రస్ట్‌కు పదివేల రూపాయల విరాళం ఇవ్వడంతో పాటు ఐదువేల రూపాయలు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్సనం లభిస్తుంది. 
 
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవ చూపిస్తూ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్సనానికి సంబంధించి ప్రతిరోజు 10 వేల టోకెన్లను ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయించారు. ఐదు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు టిక్కెట్లను ఇవ్వనున్నారు.
 
తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం, రామచంద్ర పుష్కరిణి వద్ద, మహతి ఆడిటోరియం, రామానాయుడు స్కూలు, ఎం.ఆర్.పల్లిలోని న్యూ మార్కెట్ వద్ద టోకెన్లను అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు