ఇతర రాష్ట్రాల సిపిఎస్ విధానం పరిశీలించండి: సిఎస్

బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:41 IST)
వివిధ రాష్ట్రాల్లో కంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ పై అనుసరిస్తున్న విధానాలను ఒకసారి పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు స్పష్టం చేశారు.

అమరావతి సచివాలయంలో కంట్రీబ్యూటరీ పింఛన్ స్కీమ్ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. కంట్రీబ్యూటరీ పింఛన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈ విషయమై ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ త్వరగా నివేదికను ఇవ్వాలని ఆదేశించిన నేపధ్యంలో దీనిపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.

సిపిఎస్ ఉద్యోగులు కూడా ఈ అంశంపై అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న నేపథ్యంలో దీనిపై త్వరితగతిన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సిఎస్ పేర్కొన్నారు.

కావున ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాన్ని ఒకసారి పరిశీలించి వచ్చాక దానిపై సమీక్షించి కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయా అధికారులను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
 
ఈ సమావేశంలో ఆర్థిక మరియు పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్.ఎస్.రావత్,గోపాలకృష్ణ ద్వివేది,సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు