వైసిపి వైఫల్యాల వల్లే రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభణ: చంద్రబాబు

మంగళవారం, 21 జులై 2020 (19:58 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిపి సీనియర్ నాయకుల సమావేశం మంగళవారం ఆన్ లైన్ లో జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,.. ‘‘మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ అకాల మరణం పట్ల సంతాపం తెలిపారు. కురుపాం నియోజకవర్గ ప్రజలకు, విజయనగరం జిల్లా టిడిపికి చేసిన సేవలను ప్రశంసించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం పరితపించారు. జనార్ధన్ థాట్రాజ్ మృతి టిడిపికి తీరనిలోటు. 
 
1). రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరగడం ఆందోళనకరం. మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా ఉంది, రికవరీ రేటులో అట్టడుగున ఉన్నాం. కోవిడ్ వైరస్ అన్ని జిల్లాలకు, గ్రామాలకు విస్తరిస్తోంది. అన్నివర్గాల ప్రజలు ఆర్ధికంగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు. 

టిడిపి ప్రభుత్వ హయాంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. విశాఖలో మెడ్ టెక్ పెట్టాం. అమరావతిలో,విశాఖలో అత్యున్నత వైద్యశాలల ఏర్పాటుకు కృషి చేశాం. వైసిపి వచ్చాక వాటిని రద్దు చేశారు, నిర్వీర్యం చేశారు. 
ఇప్పుడు వైద్యులకు పిపిఈలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.  ఆర్టీజిఎస్ ఉంటే ఇప్పుడీ కరోనా పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడేది. వైసిపి ప్రభుత్వ అజాగ్రత్త, అసమర్ధత వల్లే కోవిడ్ పెరిగిపోయింది. గత 3రోజుల్లో 13వేల పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. 

రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు, చేర్చుకున్నవారికి సరైన ఆహారం లేదు, ఆక్సిజన్ సరఫరా లేదు, అంబులెన్స్ ల నిర్వహణ అధ్వానం, ఒక్కో అంబులెన్స్ లో డజన్ల సంఖ్యలో రోగులను కుక్కుతున్నారు. 
క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఏమిటి..? ఇప్పుడు అందజేస్తున్న ఆహారం ఏమిటి..?

అన్నా కేంటిన్లలో రూ 5కే టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఆహారం ఎలా ఉంది..?  క్వారంటైన్ కేంద్రాల్లో వైసిపి ప్రభుత్వం ఇచ్చే రూ500 ఆహారం ఎలా ఉంది..? ఉడికీ ఉడకని అన్నం, మాడిపోయిన చపాతీ, ఎండిపోయిన ఇడ్లీ, నీళ్ల సాంబారు, కంపుగొట్టే కూరలు రోగులకు ఇస్తారా..? డిశ్చార్జ్ అయిన రోగులకు రూ2వేలు ఇస్తామని చెప్పి రూ50, రూ100 చేతిలో పెట్టి పంపిస్తారా..?

కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారు..? కరోనా ముసుగులో వైసిపి నేతలు యధేచ్చగా దోపిడి చేస్తున్నారు. వీటన్నింటినిపై ప్రజలను చైతన్యపరచాలి. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండాలి. అన్నివర్గాల  ప్రజలకు సంఘీభావంగా నిలబడాలి
 
2). ప్రకాశం జిల్లా నుంచి తరలిస్తున్న రూ5కోట్ల 27లక్షలు తమిళనాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడటంపై జయ టివి, న్యూస్ 18 తమిళ ఛానళ్లు ప్రసారం చేశాయి. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హవాలాపై వార్తలు వచ్చాయి. రెడ్ శాండల్ మనీ అని, హవాలా మనీ అని తమిళ న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. 

కరోనా సమయంలో అంత నగదు ఎక్కడిది..? ఇంత నగదు ట్రాన్సాక్షన్ చేసే వ్యాపారం బంగారం వ్యాపారికి ఉందా..? బంగారం కొనడానికి నగదు తీసుకెళ్తారా, చెక్కులు, డీడిలు తీసుకెళ్తారా..?  చెన్నైలో ఎవరి దగ్గర బంగారం కొన్నారు..? ఎవరికి ఇవ్వడానికి ఈ నగదు తీసుకెళ్తున్నారు..? వాళ్లకు బాలినేనికి ఉన్న బంధుత్వం ఏమిటి..? 

పట్టుబడ్డ ముగ్గురు దుకాణం ఉద్యోగులా, మంత్రి బాలినేని అనుచరులా..? పారిపోయిన ఇద్దరు ఎవరు, వారిలో బాలినేని కొడుకు ఉన్నాడనే వార్తల్లో నిజమెంత..? బంగారం వ్యాపారంలో బాలినేని భాగస్తుడా..? వీటన్నింటికీ జవాబివ్వాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉంది.

ఈ హవాలా భాగోతం వాస్తవాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ జరపాలి. 14నెలలుగా ఏపిలో హవాలా లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెల్లడించాలి. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
 
3).రాష్ట్రంలో టిడిపికో న్యాయం, వైసిపికి ఇంకో న్యాయమా..? 
తప్పుడు సాక్ష్యాలతో టిడిపి నేతలను అరెస్ట్ చేస్తారు. పక్కా సాక్ష్యాలు దొరికినా వైసిపి నాయకులను అరెస్ట్ చేయరు. 
తప్పుడు సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. రూ5కోట్ల 27లక్షల నగదు హవాలాలో మంత్రి బాలినేనిని ఎందుకు  అరెస్ట్ చేయరు..? షెల్ కంపెనీలతో హవాలా లావాదేవీలు చేస్తున్న వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయరు.? న్యాయమూర్తిపై దాడి సూత్రధారి పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు..?
 
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఆధారాలు తుడిచేసినవాళ్లను అరెస్ట్ చేయరు. మృతదేహానికి కట్లు కట్టినవాళ్లను అరెస్ట్ చేయరు. చివరికి వివేకానంద రెడ్డి భార్య, కూతురు నిందితులపై కఠిన చర్యల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. 
బాలినేని హవాలాకు సంబంధించి పై పోస్ట్ పెట్టిన యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్ లో కొడతారు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు తొలగించారని నిలదీసిన నెల్లూరు వృద్దురాలిపై కేసు పెడతారు.

దళిత న్యాయమూర్తి రామకృష్ణను ‘‘వాడు వీడు’’ అని నోరు పారేసుకున్న మంత్రిపై చర్యలు తీసుకోరు. న్యాయమూర్తిపై దాడిచేసి దారుణంగా కొట్టిన వాళ్లను ఏం చేశారు..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి.  

గుంటూరులో గుట్కా తయారీ వైసిపి ఎమ్మెల్యే గోడౌన్ లోనే, పట్టుబడింది వైసిపి వార్డు అధ్యక్షుడు. 25వేల గుట్కా ప్యాకెట్లు, 21టన్నుల వక్క,14క్వింటాళ్ల కత్తా, 10లక్షల విలువైన జర్దా, కెమికల్, రూ కోటి విలువైన 3ప్యాకింగ్ యంత్రాలు పట్టుబడ్డాయి. గతంలో మంగళగిరిలో గంజాయి బైటపడింది. గుట్కా తయారీ, గంజాయి అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటే  ఎంత బరితెగించారో తెలుస్తోంది.
 
4).నిన్న ఒక్క రోజే 3ప్రాంతాల్లో మహిళలపై అమానుషాలు.. 1)నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం యువతిపై శ్రీకాళహస్తిలో సామూహిక అత్యాచారం..2)నాటుసారా తయారీపై ఫిర్యాదు చేసిందని నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపూడిలో మహిళా వాలంటీర్ సహా 5గురు మహిళలపై రాళ్లదాడి..3)విజయవాడలో ఏపి మాల మహానాడు అధ్యక్షురాలు మీడియా సమావేశంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం..

దళితులపై గత ఏడాదిగా విపరీతంగా దాడులు పెరిగిపోయాయి. డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ అనితారాణిపై అమానుషాలు, మాజీ ఎంపి హర్షకుమార్ పై తప్పుడు కేసులు..దళితులపై ఇన్ని అత్యాచారాలు, అరాచకాలు జరుగుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నోరు విప్పలేదు.

బాబాయి హత్య కేసులో నోరు విప్పడు, బాలినేని హవాలాపై నోరు విప్పడు, పెద్దిరెడ్డి దౌర్జన్యాలపై నోరు విప్పడు...క్వారంటైన్ కేంద్రాల్లో నాసిరకం ఆహారంపై నోరు విప్పడు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై రూ50వేల కోట్ల భారాలపై నోరు విప్పడు. అరాచక పాలనకు ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు.
 
5). ఎవరికీ అపరిమిత అధికారాలు లేవు. అందరికంటె రాజ్యాంగమే గొప్ప. మనల్ని పాలిస్తోంది మనుషులు కాదు, చట్టం...దేశంలో వ్యవస్థలన్నీరాజ్యాంగం పరిమితులకు లోబడే పనిచేయాలి.  రాజ్యాంగం ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ. ప్రభుత్వాల చర్యలు, అవిచేసే చట్టాల వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, న్యాయ సమీక్షే దానికి పరిష్కారం. ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా కోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు ఉందన్న’’ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు అక్షర సత్యాలు.
 
6). కరోనా కష్టాల్లో ప్రజలుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. ఏడాదిలో 3సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. కరెంటు బిల్లులు 4రెట్లు అధికం చేశారు. ఆర్టీసి ఛార్జీలు పెంచి రూ2వేల కోట్ల భారం వేశారు. ఇసుక, సిమెంటు ధరలు పెంచేశారు. రూ 16వేల కోట్ల లోటులోనూ టిడిపి హయాంలో ప్రజలపై భారాలు మోపలేదు. 

వైసిపి ఏడాదిలోనే పేదలపై రూ50వేల కోట్ల భారాలు మోపారు. 34స్కీములు రద్దు చేశారు. రూ లక్ష కోట్లు అప్పులు చేశారు. రాబోయే 4ఏళ్లలో ఎన్ని అప్పులు చేస్తారో ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 34.6%కి పెరిగింది. ఒక్క ఏడాదిలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భవిష్యత్ తల్చుకుంటేనే భయం వేస్తోంది. 

సెల్ఫ్ ఫైనాన్స్ సిటిగా రూపొందించిన అమరావతిని చంపేశారు. పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. యువత ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేశారు. ఇసుక కొరత సృష్టించి, ధరలు పెంచి నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చారు, 40లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టారు. కరోనా లాక్ డౌన్ లతో ఉపాధి కోల్పోయి లక్షలాది వలస కార్మికులు స్వస్థలాలకు తరలివచ్చారు. 

7) ఈ పరిస్థితుల్లో కొత్తగా మరో 24బిసి కార్పోరేషన్ల ఏర్పాటు, ఆయావర్గాల ప్రజలను దగా చేయడమే. ఉన్న కార్పోరేషన్లకే నిధులు ఇవ్వకుండా తూట్లు పొడిచారు. నిధులను దారిమళ్లించి నిర్వీర్యం చేశారు. కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి గండికొట్టారు. పేదల జీవనోపాధులపై చావుదెబ్బ తీశారు. భూముల కొనుగోలు పథకాన్ని అవినీతి మయం చేశారు. వీటన్నింటి నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడీ కొత్త కార్పోరేషన్ల డ్రామాకు తెరదీశారు.

వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి వైసిపి చేస్తున్న నష్టాలపై ప్రజలను చైతన్య పరచాలి. కష్టాల్లో ఉన్న పేదలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను టిడిపి నాయకులు ఆదుకోవాలి, వారికి అన్నివిధాలా అండగా ఉండాలి. వారిలో మనోధైర్యం కల్పించాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, పార్టీ  సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు