కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

శనివారం, 3 జులై 2021 (13:23 IST)
తిరుపతి, కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది..  నియంత్రణలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. నివారణ చర్యల్లో నిమగ్నం కావాలని ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో కరోనా కట్టడి, దిశ యాప్ డౌన్లోడ్, జగనన్న కాలనీలలో నిర్మాణాలు, పింఛన్ పథకం అమలు, డెంగ్యూ జ్వరం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి  టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించారు.

గ్రామీణ మండలాల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పాజిటివ్ కేసులను సకాలంలో గుర్తించి వారిని తగిన జాగ్రత్తలతో హోం ఐసోలేషన్లో ఉండేలా వైద్య సిబ్బంది అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. 
 
నియోజకవర్గ పరిధిలో మహిళల భద్రతకు భరోసా కల్పించే దిశా యాప్ నూరు శాతం మహిళలు తమ స్మార్ట్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలోనే దిశా యాప్ ను ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకున్న నియోజకవర్గంగా చంద్రగిరి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. 
 
క్షేత్ర స్థాయిలో పింఛన్ పంపిణీ పక్కాగా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశించారు.  బయోమెట్రిక్, ఐరిష్ విధానాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అంతే కాకుండా ముందస్తుగా కుటుంబ సభ్యులు నమోదు చేసుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్ ను పరిగణలోకి తీసుకొని పెన్షన్ జారీ చేయాలన్నారు. ఏ ఒక్క కారణం చేత పింఛన్ ఇవ్వకుండా ఉండరాదని సూచించారు. 
 
జగనన్న కాలనీలలో నిర్మితమవుతున్న గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా శని, ఆదివారం కూడా ఉంటుందని తెలిపారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వారు ఈ రెండు రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదికారులను ఆదేశించారు. 
 
ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. డెంగ్యూ జ్వరం పట్ల అశ్రద్ద వహించరాదన్నారు. జ్వరం, తలనొప్పి అధికంగా ఉంటుందని డెంగ్యూ లక్షణాలను ఎమ్మెల్యే వివరించారు. అశ్రద్ద వహిస్తే ప్లేట్ లైట్స్ తగ్గి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమతెరలు వినియోగించాలని  సూచించారు. ఈ సమీక్షలో ఎంపిడిఓ లు, తహశీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు