విజ‌య‌వాడ కరోనా స్వాబ్ కలెక్షన్ బూత్... సురక్ష పద్ధతిలో కరోనా పరీక్షా నమూనా సేకరణ

శనివారం, 11 ఏప్రియల్ 2020 (07:32 IST)
కోవిడ్ -19 (కరోనా) వ్యాధి నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే నమూనా సేకరణకు జిల్లా యంత్రాగం వినూత్న కేబిన్‌ను రూపొందించింది. నమూనా సేకరణ చేసే సిబ్బందికి సురక్షితంగా వుండే వీలు కల్పించేలా కలెక్షన్ బూత్ డిజైన్ చేశారు.

ఈ మేర‌కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ మార్గదర్శకంలో వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్ట‌ర్ కె.జ్యోతిర్మణి, క్వాలీటి కన్సల్టెంట్ డాక్ట‌ర్ చైతన్య కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా నమూనా సేకరణ కేంద్రం (స్వాబ్ కలెక్షన్ బూత్) ప్రత్యేక డిజైన్ లో తయారు చేయించారు.

ఈ సందర్భంగా సంబందిత కోవిడ్ -19 స్వాబ్ కలెక్షన్ బూత్ నమూనాను శుక్రవారం జిల్లా కలక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. క్యాబిన్‌లో నుంచి కేవలం మోచేతి వరకు గ్లౌజులు ధరించిన చేతులు వచ్చే విధంగా ఈ క్యాబిన్ అమరికను రూపొందించారు.

పరీక్ష చేయించుకునే వారికి, వైద్య పరీక్షలు నిర్వహించేవారికి మధ్య ఈ క్యాబిన్ రక్షణా కవచంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. సుమారు 15 సెకండ్ల వ్యవధిలో వ్యాధి నిర్ధారణ  పరీక్షా నమూనా సేకరణ చేసే వీలుందన్నారు.

స్వాబ్ కలెక్షన్ బూత్‌ను పరీశిలించిన అనంత‌రం కలెక్టర్ ఇంతియాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటివి అవసరమైన సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాల‌ని వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్‌ని ఆదేశించారు.

విస్తృతంగా నమూనా సేకరణ శనివారం నుంచి కరోనా నిర్ధారణ కోసం నమూనాలు సేకరించడం విస్తృతం చేస్తామని, ఇందుకు ఈ క్యాబిన్లు ఎంతో ఉపయోగకరంగా వుంటాయని డిసిహెచ్ జ్యోతిర్మణి చెప్పారు. వీటిని తొలుత విజయవాడ నగర కార్పొరేషన్‌లో ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు