పార్టీ శ్రేణులు జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలి : తెదేపా ఎంపీ గల్లా జయదేవ్

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:00 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో దేశంలో జమిలి ఎన్నికలు జరుగనున్నాయని, వాటికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా శుక్రవారం తెనాలి శ్రవణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ పాల్గొని ప్రసంగిస్తూ, త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలు జరుగుతాయనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. 
 
2022లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని... మనమంతా సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ధర్మం మనవైపే ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఈ కారణంగానే న్యాయ వ్యవస్థనే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసుల్లో శిక్షపడి జైలుకు వెళ్లినా... ప్రజల్లో సానుభూతి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. 
 
అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర స్థాయిలో జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలను, తప్పులను తాను ఎత్తి చూపుతున్నానని, అందుకే తనను, తన కుటుంబాన్ని వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని గల్లా జయదేవ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు