కామాంధుల వేధింపులు భరించలేను.. పిల్లలను చంపి సూసైడ్ చేసుకుంటున్నా

శుక్రవారం, 5 జనవరి 2018 (12:17 IST)
ఇటీవల విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య చేసుకున్న కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఇపుడు కీలకమైన ఆధారంగా భావించే సూసైడ్ నోట్ లభించింది. 
 
విశాఖ, ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలైన విష్ణుతేజ, జాహ్నవీలను చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, సౌమ్య ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను రాసిపెట్టింది. ఈ నోట్‌లో సౌమ్య సంచలన ఆరోపణలు చేసింది. 
 
తమ చుట్టూ చాలామంది కామాంధులు తిరుగుతున్నారనీ, వారి వేధింపులు, బ్లాక్‌మెయిల్స్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని అందులో పేర్కొంది. చాలా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నానని, ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తర్వాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా తీసుకెళుతున్నానని సూసైడ్ నోట్‌లో రాసింది. 
 
అయితే, రాజేష్ కూడా ఆత్మహత్యకు ఎందుకు ఉపక్రమించాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని కనుగొనేందుకు పలు కోణాల్లో కేసును విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు