ఆంధ్రాను పగబట్టిన కరోనా వైరస్ : ఒక్క రోజులోనే 54 మంది మృత్యువాత

సోమవారం, 20 జులై 2020 (19:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శవేరంగా వ్యాపిస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 54 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గత 24 గంటల్లో 4074 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 53,724 కేసులు నమోదయ్యాయి. 
 
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1086 కేసులు రావడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. అటు, కర్నూలు (559), గుంటూరు (596) జిల్లాల్లోనూ భారీగా కేసులు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. 
 
ఇక, మరణాల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 54 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 696కి పెరిగింది. ఇవాళ 1,335 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 28,800 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరును కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో పట్టణ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా బాధితులు 400 మైలురాయిని దాటేశారు. గడచిన పది రోజుల్లోనే 113 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆదివారం ఒక్కరోజే 54 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు సమాచారం.
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మొత్తం కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. సోమవారం తూ.గో తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 596 కరోనా కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు