కనిగిరిలో చెట్ల నరికివేతను అడ్డుకున్న స్థానికులు... సీఎం జగన్‌ వస్తే.. ఏంటి గొప్ప?

ఠాగూర్

ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (09:54 IST)
ఎక్కడైనా ప్రముఖులు పర్యటిస్తే గుర్తుగా మొక్కలు నాటతారు. కానీ, వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే మాత్రం అక్కడ నీడనిచ్చే పచ్చని చెట్లను నరికివేయడం ఆనవాయితీగా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ అదే తీరు పునరావృతమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కనిగిరిలో ఆదివారం సీఎం జగన్‌ రోడ్‌షో నిర్వహించనున్నారు. బస్సు యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే పచ్చని వేప, చింత చెట్లను శనివారం నరికివేశారు. కొన్నేళ్లుగా ఉన్న ఈ పచ్చని చెట్లను నరికివేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోయారు. 
 
ముఖ్యంగా, కనిగిరిపట్టణంలోని చింతలపాలెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్ల స్టాండ్‌ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, హోర్డింగ్‌లను తొలగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సీఎం జగన్‌ వస్తే ఏంటి గొప్ప? ఎన్నో ఏళ్ల నుంచి నీడనిస్తున్న వృక్షాలను తొలగించడం ఏంటని మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం వస్తే చెట్లు నరికేస్తారా.. ఇదెక్కడి తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సిబ్బంది ఐదు చెట్లను నరికివేశారు. 
 
మరో 20 చెట్ల కొమ్మలను తొలగించారు. ఎక్కువ మంది చేరి నిలదీయడంతో సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రాన్ని పాలించిన ఏ ఒక్క ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఇలాంటి దారుణాలు జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ఒక గంట, అరగంట పర్యటన కోసం కొన్ని సంవత్సరాల నుంచి నీడ నిస్తున్న పచ్చని చెట్లను నరికివేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు