తెలుగు - తమిళ రాష్ట్రాలకు "నివర్" తుఫాను ముప్పు!!

సోమవారం, 23 నవంబరు 2020 (07:53 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు.. తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం వాయుగుండంగా, మంగళవారం తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. 
 
ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన 'నివర్' అని పేరుపెట్టారు. ఈ తుఫాను బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కారైక్కాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే కోస్తాంధ్రలో వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో మంగళవారం నుంచి, బుధవారం నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అందువల్ల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన 'గతి' తుఫాను కొనసాగుతోంది. అయితే, ఇది పశ్చిమ తీరానికి దూరంగా కేంద్రీకృతమైవున్నప్పటికీ.. వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు