ఓ వైపు కరోనా మహమ్మారి... మరోవైపు విషజ్వరాల పంజా..

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు విష జ్వరాల బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, కరోనా, డెంగీ లక్షణాలు ఒకేలా ఉండటంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. 
 
ముఖ్యంగా, విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా, గన్యా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. 
 
మలిదశ కొవిడ్ తగ్గకుండానే విషజ్వరాలు, డెంగీ కేసులు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరపీడితుల సంఖ్యకు తగ్గట్లు ఆసుపత్రుల్లో సేవలు అందట్లేదు. 
 
ముఖ్యంగా రక్తపరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లాల్సి వచ్చి వేలల్లో ఖర్చవుతోంది. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి భారీగా రోగులు వస్తున్నా, జ్వర నిర్ధారణ కిట్లు లేవు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ లేరు. 
 
ఉలవపాడు, కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు, పెదదోర్నాలలో సీబీపీ యంత్రాలు లేవు. 
 
చీరాల ఏరియా ఆసుపత్రిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వంటి పరీక్షలు చేయాల్సి ఉండగా ఒక ల్యాబ్ సహాయకుడే ఉన్నారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురంలో డెంగీ నిర్ధారణ పరీక్షకు సౌకర్యం ఉన్నా, ఫలితాలకు రెండు, మూడు రోజుల సమయం పడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు