ఆర్డిరిచ్చిన వెంటనే చికెన్ పకోడీ తేలేదని... బాలుడ్ని కొట్టి చంపిన మద్యంబాబులు

మంగళవారం, 30 మార్చి 2021 (07:52 IST)
ఆర్డరిచ్చిన వెంటనే చికెన్ పకోడీ తేలదన్న కోపంతో కొందరు మద్యంబాబులు ఓ బాలుడిని కొట్టి చంపేశారు. ముందు కారుతో ఢీకొట్టించి.. ఆ తర్వాత ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన సింగం ఏసు అనే వ్యక్తి చికెన్, మటన్ పకోడీ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయన కుమారుడు శివబాబు(16) గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 
 
ఆదివారం సెలవు కావడంతో తండ్రికి చేదోడుగా పకోడీ బండి వద్ద ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి వీరబాబు ఆదివారం రాత్రి వీరి పకోడీ బండి సమీపంలో మద్యం సేవిస్తున్నాడు. తనకు పకోడీ తీసుకురమ్మని శివబాబును వీరబాబు ఆదేశించాడు. 
 
వెంటనే పకోడీ తీసుకెళ్లకపోవడంతో వీరబాబు ఆగ్రహం చెందాడు. తన స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయి, కొద్దిసేపటికే తిరిగి వచ్చి నేరుగా పకోడీ బండిని స్కార్పియోతో ఢీకొట్టాడు. దీంతో శివబాబుకు గాయాలయ్యాయి. 
 
అనంతరం వీరబాబు స్కార్పియో దిగి ఇనుపరాడ్డుతో శివబాబును తీవ్రంగా కొట్టాడు. శివబాబును కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. 
 
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులను మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు