మే 3 వరకు ఇ-పాస్ గడుపు పెంపు: హిమాన్హు శుక్లా

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (22:51 IST)
ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తూ అత్యవసర సేవలలో పాలు పంచుకుంటున్న ఉద్యోగులకు జారీ చేసిన ఇ-పాస్‌ల గడువు మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కరోనా కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి, చేనేత జౌళి శాఖ కమీషనర్ హిమాన్హు శుక్లా తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ప్రైవేట్ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ పాస్ గడువు ఏప్రిల్ 14 తేదీతో ముగిసినప్పటికీ అవి యధాతధంగా మే 3వ తేదీ వరకు చెల్లుబాటు కానున్నాయి. 
 
ఇప్పటివరకు దాదాపు 13000 ఈ పాస్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయగా, పాస్ పొందినవారు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వాటిని పొడిగించామన్నారు. ఇప్పటికే పాస్ పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని, అవి స్వయం చాలితంగా అమలులోకి వస్తాయని హిమాన్హు శుక్లా స్పష్టం చేసారు. 
 
ప్రధాని లాక్ డౌన్ కాలాన్ని మరో 19 రోజులు పొడిగించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, నూతనంగా పాస్ జారీ కూడా యధాతధంగా కొనసాగుతుందని శుక్లా పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగనుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్‌ను మంజూరు చేస్తోంది.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు అధికారులు ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తున్నారు. వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓఆర్‌టి నెంబర్ 289లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి, సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరికీ ఈ పాస్ మంజూరు చేసారు. 
 
సంస్థ యజమాని తనతో సహా ఇరవై శాతం ఉద్యోగులకు కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు,  షరతులకు లోబడి మంజూరు చేస్తున్నామని హిమాన్హు శుక్లా తెలిపారు. పాస్ పొందేందుకు  ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా కొత్తగా పాస్ కావలసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (www.spandana.ap.gov.in/) ద్వారా కూడా పాస్ పొందగలుగుతారని వివరించారు.
 
నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్‌ను ప్రత్యేక QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్‌కు పంపుతున్నామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని లాక్ డౌన్ పెరిగిన నేపధ్యంలో కాలపరిమతి సైతం ఆటోమెటిక్‌గా మారుతుందన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందించగా, తద్వారా పోలీసు అనుమతి మేరకు పాస్ వినియోగించుకుంటున్నారన్నారు.
 
భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్‌కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉందని, చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక, అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని శుక్లా వివరించారు. ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌ల దృష్టికి వెళతాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు