అచ్చంపేట ట్రాన్స్‌కో స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్రమాదం - రూ.కోట్లలో ఆస్తి నష్టం

బుధవారం, 25 ఆగస్టు 2021 (09:33 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని అచ్చంపేట సమీపంలో ఉన్న 220/132 కేవీ ట్రాన్స్‌కో స‌బ్‌స్టేష‌న్‌లో 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
అగ్ని ప్రమాదం కారణంగా జిల్లాలోని కోన‌సీమ‌, రామ‌చంద్రాపురం, కాకినాడ ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. 
 
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం, న‌ర్సాపురం నుంచి కోన‌సీమ‌కు, రామ‌చంద్రాపురానికి బొమ్మూరు నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఏర్పాట్లు చేశారు. కాకినాడ‌కు పెద్దాపురం నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేశారు. 
 
ప్ర‌మాదం జ‌రిగిన అర‌గంట‌లోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ చేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించివుంటుందని అధికారులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు