తండ్రిని వదిలించుకోవడానికి ప్లాన్.. సినిమా షూటింగ్ చూపిస్తామని తీసుకొచ్చి గొయ్యిలో పడేసిన కుమారులు..

ఠాగూర్

బుధవారం, 15 అక్టోబరు 2025 (17:06 IST)
తమ వద్ద ఉన్న వృద్దాప్య తండ్రిని వదిలించుకువడానికి ఇద్దరు కుమారులు ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ చూపిస్తామని నమ్మించి నగరానికి తీసుకొచ్చి ఓ గొయ్యిలో పడేసి వెళ్లిపోయారు. దీన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రెడ్ క్రాస్ సిబ్బంది వచ్చి ఆ వృద్ధుడుని రక్షించి ఆశ్రయం కల్పించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన నందమూడు భాస్కరరావు (70)కు ముగ్గురు కుమారులున్నారు. దసరా పండుగ సమయంలో ఆయన కుమారులు తండ్రిని సినిమా షూటింగ్ చూపిస్తామంటూ విశాఖ నగరానికి తీసుకొచ్చారు. అనంతరం అగనంపూడి సమీపంలోని శనివాడ - స్టీల్ ప్లాంటు రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద గొయ్యిలోకి తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
కొన్ని గంటల పాటు ఆహారం లేక, నిస్సహాయ స్థితిలో గొయ్యిలోనే ఉండిపోయిన భాస్కర రావును కొందరు స్థానికులు గమనించారు. వెంటనే ఆయనను బయటకు తీసి, ఆకలి తీర్చడానికి ఆహారం అందించారు. ఈ విషయాన్ని సింధు ప్రియ అనే మహిళ పెదవాల్తేరులోని రెడ్ క్రాస్ సంస్థకు తెలియజేశారు.
 
సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనంతరం తమ షెల్టర్ లెస్ హోంకు తరలించారు. ప్రస్తుతం భాస్కరరావు వారి సంరక్షణలో ఉన్నారు. కనిపెంచిన తండ్రి పట్ల కన్నకొడుకులే ఇంత కర్కశంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు