ఏపీలో 12.81ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లకు ఉపాధి మార్గం

గురువారం, 20 ఆగస్టు 2020 (08:41 IST)
వైఎస్సార్ చేయూత పథకం క్రింద జీవనోపాధి పొందేందుకు ఇప్పటివరకు వివిధ జిల్లాల నుంచి 12,81,067 మంది లబ్ధిదారులు నవశకం పోర్టల్‌లో ఉపాధి అవకాశాలను ఎంచుకున్నారని అందులో అత్యధికంగా 1,57,037 మంది గేదెల కొనుగోలుకు తమ ఆప్షన్లు ఇచ్చారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి  తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అందివ్వని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు ఏటా రూ.18,750 చొప్పున ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి 23 లక్షల మంది మ‌హిళ‌ల‌కు దాదాపు రూ.4,250 కోట్లు అందించిన‌ట్లు తెలిపారు. 4ఏళ్లలో దాదాపు 23 లక్షల మందికి వైఎస్సార్ చేయూత పథకం క్రింద రూ.17 వేల కోట్ల ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు.

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందే డబ్బును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌ను జీవనోపాధి కార్యక్రమాలకు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నడుపుకోవడానికి లేదా మరే ఇతర అవసరాలకైనా వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం వారికి అందించిందన్నారు. మహిళలు జీవనోపాధి పొందేందుకు, ఆర్ధికంగా వారి జీవితాల్లో పరిపుష్టి సాధించేందుకు ఈ ఆర్దిక సాయం ఉపయోగపడుతుందన్నారు.

కాగా వివిధ జీవనోపాది కోసం నమోదు చేసుకున్న మహిళల్లో ఆవుల కొనుగోలుకు 1,51,090 మంది, గేదెలు కొనుగోలుకు 1,57,037 మంది, గొర్రెల కొనుగోలుకు 1,04,347 మంది, మేకల కొనుగోలుకు 62,921 మంది, కిరాణా షాపులు పెట్టుకునేందుకు 78,832 మంది, అగరుబత్తీల తయారీకీ 5,813 మంది, పండ్ల దుకాణాలు పెట్టుకునేందుకు 29,933 మంది, కూరగాయల షాపులు పెట్టుకునేందుకు 75,131 మంది మరియు ఇతర వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 6,15,963 మంది ఆప్షన్లు ఇచ్చారన్నారు.

మొత్తం 23 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటికే 12,81,067 మంది వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవడానికి తమ తమ ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు.  ఈ సంఖ్య ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విధంగా లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా డబ్బును వినియోగించటం వల్ల వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

అంతేకాకుండా లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించటం మరియు వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్కెటింగ్,

సాంకేతికపరమైన సహకారాన్ని అందించేలా అమూల్, ఐటీసీ, హెచ్‌యుఎల్, పి&జీ, రిలయన్స్  లాంటి ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలతో అవగాహ ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి 6  బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా ఉన్నత స్ధితికి చేర్చి వారి కుటుంబాలలో సంతోషాలను నింపేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు