ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (17:12 IST)
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుధీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 
 
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస రెడ్డి (ఓఎంసీ ఎండీ), గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌తో పాటు ఓఎంసీ కంపెనీని కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరందరికీ ఏడేళ్ళ జైలుశిక్ష చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. 
 
మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాత్రం కోర్టు ఊరట కల్పించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసి విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. వీరిపై మోపిన అభియోగాలు నిరూపితం కాలేదని న్యాయస్థానం పేర్కొన్నట్టు సమచారం. 
 
ఈ కేసులో ఏ1గా బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2గా గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3గా వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ, ఏ7గా కె.మొఫజ్ అలీఖాన్ దోషులుగా తేలారు. కాగా, ఏ8గా ఉన్న కృపానందం, ఏ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులుగా ప్రకటించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఏ5 నిందితుడుగా ఉన్న అటవీ శాఖ అధికారి లింగారెడ్డి మరణించారు. ఇక మరో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (ఏ6)ని తెలంగాణ హైకోర్టు 2022లోనే ఈ కేసు నుంచి పూర్తిగా డిశ్చార్జ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు