ఎగ్జిబిష‌న్ సంద‌ర్శ‌న‌తో మాన‌సిక ఉల్లాసం.. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

గురువారం, 18 జులై 2019 (08:19 IST)
విజయవాడ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు గ‌డ‌చిన 30 ఏళ్లుగా ప్ర‌భుత్వంతో పాటు ప్రైవైటు సంస్థ‌లు కూడా కృషి చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. న‌గ‌రంలోని స్వ‌రాజ్య‌మైదానంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను బుధ‌వారం సాయంత్రం ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బ‌న్ క‌త్తిరించి ప్రారంభించారు. 
 
అనంత‌రం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వ‌హించే సంత‌ల వంటివే ఎగ్జిబిష‌న్ అని చ‌మ‌త్క‌రించారు. ఎగ్జిబిష‌న్ సంద‌ర్శ‌న‌తో ముఖ్యంగా మాన‌సిక ఉల్లాసం ఉంటుంద‌ని పేర్కొన్నారు. వేలాది ర‌కాల వ‌స్తువుల‌ను ఒకేచోట కొలువు చేర్చి వినియోగ‌దారుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో అందించేందుకు శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని నిర్వాహ‌కుల‌కు సూచించారు. సాయంత్రం సమయాల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా ఎగ్జిబిష‌న్‌లో లేటెస్ట్ ఎమ్యూజ్యెంట్ రైట్స్‌ను అనేకం ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు. 
 
ఏపీలోనే తొలిసారిగా స్కీమ్లవర్, సునామీ రైడ్స్‌ను తొలిసారిగా స్వ‌రాజ్య‌మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌లో ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఎగ్జిబిష‌న్ తిల‌కించి ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ నిర్వాహకులు ఎం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారుల కోసం జెయింటివీల్, రిప్లికా, స్నోవరల్డ్, ట్రైన్ వంటి ఎన్నో రకాల రైడ్స్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 
 
మహిళలు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా దుస్తులు, జ్యుయలరీ, చెప్పులు, అలంకరణ వస్తువులు, అన్నిరకాల ఫుడ్ స్టాల్స్, గృహాలంకరణ ఉత్పత్తులు ఇలా పలు రకాల స్టాల్స్ కొలువుదీరాయ‌న్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ న‌గ‌రవాసులకు అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. 
 
ఆదివారం, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రదర్శన జరుగుతుంద‌ని తెలిపారు. ఎగ్జిబిష‌న్‌లో 200 పైగా స్టాల్స్‌తో 60 రోజుల పాటు కొన‌సాగుతుంద‌న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టవర్‌గా చెప్పే బుర్జ్ ఖలీపా ఈ ఏడాది ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంద‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు