ప్రముఖ నవలా రచయిత్రి, యద్దనపూడి సులోచనారాణి ఇక లేరు..

సోమవారం, 21 మే 2018 (10:35 IST)
ప్రముఖ నవలా రచయిత్రి, యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న కుపర్టినోలో గుండెపోటుతో కన్నుమూశారు. తన  రచనల ద్వారా కోట్లాది మంది తెలుగు పాఠకులకు సుపరిచితురాలైన యద్ధనపూడి సులోచనారాణి మృతిని ఆమె కుమార్తె శైలజ ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల ఎమెస్కో విజయకుమార్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మరణించేనాటికి ఆమెకు 79 సంవత్సరాలు. 
 
1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యద్ధనపూడి సులోచనారాణి జన్మించారు. మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవాలను తన నవలల్లో పొందుపరిచారు. 1970వ దశకంలో ప్రతి చదువుకునే స్త్రీ ఇంటా యద్దనపూడి నవల కనీసం ఒకటన్నా వుంటుంది.
 
వృద్ధాప్యం మీద పడటంతో తన కుమార్తె శైలజ వద్ద కాలం గడుపుతున్న యద్దనపూడి సులోచనారాణి గుండెపోటు కారణంగా గత రాత్రి నిద్రలోనే  కన్నుమూశారని ఆమె కుమార్తె శైలజ వెల్లడించారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోయిందని వెల్లడించారు. 
 
తన తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా కుపర్డినోలోనే ముగించనున్నట్టు స్పష్టం చేశారు. తమకు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి సంతాపం చెబుతున్నారని, వారందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలని అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు