తిరుమ‌లేశునికి ఏడాదిగా ఒక్క రూపాయి విదేశీ విరాళం రాలేదు... కార‌ణం అదేనా?

మంగళవారం, 4 జనవరి 2022 (14:29 IST)
స్వచ్ఛంద, మతపరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్  (ఎఫ్‌సిఆర్‌ఏ) లైసెన్స్ తప్పనిసరి. కానీ, ఇపుడు టీటీడీకి  ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ కాక‌పోవ‌డంతో విదేశీ విరాళాల‌కు బ్రేక్ ప‌డింది.
 
 
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్  (ఎఫ్‌సిఆర్‌ఏ) లైసెన్స్ కు ఒక్క సారి దరఖాస్తు చేసుకుంటే,  లైసెన్స్ ఐదేళ్ల పాటు కొనసాగనుంది. కానీ, టీటీడీకి ఈ కాల పరిమితి 2020 డిసెంబర్ నాటికి లైసెన్స్ గడువు ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది.
 
 
దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా, 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020 -21 ఏడాదిలో టీటీడీకీ విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు పర్మిషన్ లేదు. దీనిని త్వ‌ర‌గా పున‌రుర్ధ‌రించే ప్ర‌యత్నంలో టీటీడీ అధికారులున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు