మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

ఠాగూర్

బుధవారం, 18 జూన్ 2025 (13:26 IST)
మనమంతా జగనన్న సైన్యం, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వంట్లో భయం పుట్టేలా చేద్దామని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీ మద్యం స్కామ్‌లో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన శ్రీలంకకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటగా, నాటకీయ ఫక్కీలో ఆయనను బెంగుళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసన్నారు. వైకాపా అధినేత జగన్ వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పట్టి వేధిస్తోందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి అని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు ఇపుడు ఊపందుకున్నాయి. వాటిని విజయవంతం చేయాలి. జగన్ అన్నకు మనం ఒక సైన్యంలా నిలబడాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. 
 
చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడనే ప్రచారం జరుగుతోంది. ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు. వారు ఏం చేసినా మనం జగన్ అన్న సైనికులం. గట్టిగా నిలబడదాం. చంద్రబాబుకు భయం పుట్టేలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. పార్టీ కోసం నిత్యం పని చేయాలి అని ఆయన కార్యకర్తలకు ఉత్తేజపరిచారు. తాను బయటకు వచ్చాక మళ్లీ మాట్లాడుదామని, తాను తన కుటుంబ సభ్యులు జగన్‌కు సైనికులమని, ప్రతి ఒక్కరూ వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెవిరెడ్డి కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు