ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటి నుంచి.. కేబినెట్‌లో నిర్ణయం!!

వరుణ్

మంగళవారం, 16 జులై 2024 (15:43 IST)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ విధానాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేంశంలో నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. 
 
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చామని, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇపుడు సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అమల్లోకి తెస్తామని తెలిపారు. 
 
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిపై ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు