సిమెంట్ కంపెనీలు డబ్బులివ్వలేదనే ఉచిత ఇసుక రద్దు: దేవినేని

శుక్రవారం, 8 నవంబరు 2019 (06:37 IST)
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని, వారి ఆత్మ హత్యలు అన్ని సర్కారీ ఇసుక హత్యలే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పని తీరుపై ధ్వజమెత్తారు.

ఒకపక్క కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వంలో ఏలాంటి చలనం లేదని ఆరోపించారు. కోడూరులో జరిగిన జి.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిమెంట్ కంపెనీలు డబ్బులివ్వలేదనే కోపంతోనే ప్రజలకు కారుచౌకగా అందుతున్న ఉచిత ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు.

కొత్త పాలసీ ఆన్ లైన్ అని ప్రకటించినా, గ్రామాలలో ట్రాక్టర్ ఇసుక దొరకడం లేదని పేర్కొన్నారు. వైకాపా నాయకులు మాత్రం వాటాలు వేసుకుని మరీ ఇసుకను సరిహద్దు రాష్ట్రాలకి తరలిస్తూ కోట్లు కూడా పెడుతున్నట్లు విమర్శించారు. ఐదు నెలల ప్రభుత్వ పాలనపై సామాన్యుడే పెదవి విరుస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 14వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు అండగా చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు చెప్తూ దీక్షను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. రివర్స్ టెండరింగ్ పేరిట రిజర్వు టెండరింగ్ లో ఐనవారికి అప్పలంగా పనులను అప్పగిస్తున్నట్లు ఆరోపించారు.

రాజధాని అమరావతి పై కుట్రలు చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు పని లో తట్ట మట్టి పోయేలేదని, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన పోలవరం బకాయి డబ్బులను కూడా తీసుకురాలేక పోయి నట్లు తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా సంస్థాగత ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలోపేతం కావాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు.
 
ఇసుక అమ్ముకుంటున్న మంత్రులు- బోండా ఉమా
మంత్రులే స్వయంగా ఇతర రాష్ట్రాలకు లారీ ఇసుకను లక్ష చొప్పున పంపిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించిందని, డబ్బు పిచ్చిపట్టిన ఈ ప్రభుత్వ తీరు వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని, ప్రకృతి ప్రసాదించిన ఇసుకపై ప్రభుత్వం కర్ర పెత్తనం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ ఇసుక మాఫియాను అరికట్టే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు