మానిటర్ ఆన్‌చేయకుండానే టీడీపీ నేతల టెక్నాలజీ శిక్షణా తరగతులు

శనివారం, 8 అక్టోబరు 2016 (16:50 IST)
కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని పార్టీ నేతలకు చేరువ చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, విజయవాడ కేంద్రంగా టెక్నాలజీ శిక్షణా తరగతులు కూడా ప్రారంభించారు. అయితే, ఈ శిక్షణా తరగతులకు వచ్చిన టీడీపీ నేతలు మాత్రం కంప్యూటర్ మానిటర్ ఆన్ చేయకుండానే టెక్నాలజీ గురించి తెలుసుకునే స్థాయికి ఎదిగిపోయారు. 
 
తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వ్యవహారంలో ఇలాంటి పొరపాటే జరిగింది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల చేత టీడీపీ నేతలకు చంద్రబాబు పాఠాలు చెప్పించారు. ఈ కార్యక్రమానికి  సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు. 
 
మానిటర్ కూడా ఆన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో గానీ మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారంపై నెటిజెన్లు మాత్రం మండి పడుతున్నారు. శిక్షణ ఇచ్చే విద్యార్థి మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్‌కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటో‌కు ఫోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

వెబ్దునియా పై చదవండి