గుంటూరులో ఘోరం : విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు - విద్యార్థి మృతి

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (11:58 IST)
గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. కారు ఒకటి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 
 
విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో బాపట్ల ఆదర్శనగర్‌ వద్దకు చేరుకోగానే వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్ళింది. సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. అయితే, ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. 
 
గాయపడిన మరో ఏడుగురిని స్థానిక వైద్యశాలకు తరలించారు. నిహారిక , సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో మత్స్యకారులు స్పందించకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు