ఉసురు తీసిన ఇసుక... భార్య కూలీ పనులకు వెళ్తుందనీ...

శనివారం, 26 అక్టోబరు 2019 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మికులు ఉపాధి లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. అటు కూలీ పనులు లేకు.. ఇటు కుటుంబ పోషణ భారాన్ని భరించలేని పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన నాగ బ్రహ్మాజీ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు సంగం జాగర్లమూడికి చెందిన లక్ష్మీతిరుపతమ్మతో వివాహమైంది. ఏడేళ్లుగా అదే ఊరిలోనే ఉంటూ... భవన నిర్మాణ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. 
 
అయితే, గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో పనులు దొరకడంలేదు. కుటుంబాన్ని పోషించటానికి అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిని తీర్చలేక, కొత్తగా అప్పులు పుట్టక నాగబ్రహ్మాజీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటిదాకా ఇంటి దగ్గరే ఉండి పిల్లల పోషణ చూసుకునే భార్య లక్ష్మీ తిరుపతమ్మ రెండు నెలలుగా స్పిన్నింగ్‌ మిల్లులో పనికి వెళ్లి కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఆర్థిక పరిస్థితి దిగజారడం, భార్యతో పని చేయించాల్సి వచ్చిందనే బాధతో బ్రహ్మాజీ గత పదిరోజులుగా ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలలుగా తమ సంపాదనతోనే ఇల్లు గడుస్తోందని, అది బ్రహ్మాజీని బాధపెట్టిందని ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ, అత్త శివలీల తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు