విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

ఠాగూర్

శుక్రవారం, 24 జనవరి 2025 (11:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దావోస్‌ సదస్సులో కలవడం పట్ల మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్పందించారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు. 
 
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీమంత్రి నారా లోకేశ్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలారోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్‌కు చంద్రబాబు గుర్తుచేశారు.
 
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ,"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి. మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌కు ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. 
 
రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టము నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్ బోర్డ్ తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపండి. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది" అని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు