కేటుగాడు, 15మందిని తీసుకెళ్ళి వ్యభిచార గృహంలో దింపాడు

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:25 IST)
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువతులే అతని టార్గెట్. మాయమాటలు చెబుతాడు. కావాల్సినంత డబ్బులు సంపాదించుకోవచ్చునని నమ్మబలుకుతాడు. అతని మాటలు నమ్మి విదేశాలకు వెళితే అంతేసంగతులు. వ్యభిచారం కూపంలో నరకయాతన అనుభవించాల్సిందే. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా నగరి కేంద్రంగా జరుగుతున్న తతంగం.
 
తమిళనాడు రాష్ట్రానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం చిత్తూరు జిల్లాలోని నగరి. ఈ ప్రాంతంలో ఉన్న వారికి మగ్గాలే జీవనోపాధి. అయితే కరోనా కారణంగా మగ్గాల వ్యాపారం కూడా బాగా పడిపోవడంతో ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న నగరికి చెందిన అరసు అనే వ్యక్తి యువతులను టార్గెట్ చేసుకున్నాడు. విదేశాల్లో ఉన్న తన స్నేహితులు కిరణ్‌, నాగరాజుల సహాయంతో వ్యభిచార గృహాలకు తెరలేపాడు. 
 
నగరిలో అందంగా ఉన్న యువతులను గుర్తించి వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పడం మొదలుపెట్టాడు. విదేశాల్లో తన స్నేహితులు ఉన్నారని.. ఇంటి పనికి మీ అమ్మాయిని పంపినా కావాల్సినంత డబ్బులు సంపాదించుకోవచ్చునని.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా 5 సంవత్సరాల్లో బాగా నిలదొక్కుకోవచ్చునని నమ్మబలికాడు. ఇలా 15 మంది యువతులకు సింగపూర్, మలేషియా, దుబాయ్‌లకు పంపించి వ్యభిచార గృహాలను నడపడం ప్రారంభించాడు. 
 
బాగా డబ్బులు సంపాదించాడు అరసు. అయితే వ్యభిచార గృహంలోని నగరికి చెందిన ఒక యువతి తప్పించుకుని ఇండియాకు వచ్చింది. నగరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరసును అదుపులోకి తీసుకున్నారు నగరి పోలీసులు. అరసుకు సహకరిస్తున్న మరో ఇద్దరిపైన కేసులు పెట్టారు. ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి, అలాగే వారి చెరలో ఉన్న యువతులను విడిపించేందుకు ప్రత్యేక పోలీసు బృందం విదేశాలకు వెళ్ళనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు