పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లో కోట్ల నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:50 IST)
పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లో అక్రమ దందా జరగడం బయటపడింది. ఉభయగోదావరి జిల్లాల పోలీసుల తనిఖీల్లో ఈ దందా బయటపడింది. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉదయాన్నే పద్మావతి ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. పలాస నుంచి గుంటూరు వెళ్తున్న ఈ బస్సులో 4 కోట్ల 78 లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. 
 
కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల్లో నగదు.. బంగారం మార్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఓ బస్సులో నుంచి 5 కోట్ల 6 లక్షల నగదును.. మరో బస్సులో నుంచి 10 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు.
 
ఇంత డబ్బును ఎందుకు పట్టుకెళ్తున్నారన్నది ఆరా తీసేసరికి టోల్‌గేట్ల దగ్గర సాగుతున్న బంగారం అక్రమదందా బయటపడింది. గుంటూరు కేంద్రంగా సాగుతున్న అక్రమ బంగారం వ్యాపారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు నుంచి బంగారం పంపిస్తుంటే.. శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడి వ్యాపారులు డబ్బులు పంపిస్తున్నారు. 
 
ఉభయగోదావరి జిల్లాల్లో మూడో కంటికి తెలియకుండా బస్సుల్లోనే వీటిని మార్చేస్తూ బిజినెస్ చేసేస్తున్నారు బంగారు వ్యాపారులు. ప్రైవేటు బస్సుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడడం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం బయటపడడం ఒక్కసారిగా కలకలం రేపింది. 
 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బస్సుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఏ ఏ ప్రాంతాల్లో పద్మావతి ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయో ఆరా తీస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు