శ్రీశైలానికి భారీగా వరద నీరు - జూరాలకు భారీ వరద

మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:22 IST)
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 866.8 అడుగులుగా ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 129.15గా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. హంద్రీనీవాకు 1,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇదే ప్రవాహం కొనసాగినట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  ఉండగా.. 2.62 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.690 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా..ప్రస్తుతం 318.040 మీటర్ల నీటిమట్టం నమోదైంది. మరోవైపు ఆల్మట్టికి జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి 2,79,332 ఇన్‌ఫ్లో ఉండగా.. 3,20,535 క్యూసెక్కుల నీటిని కిందికి వదులు తున్నారు. జలాశయ పూర్తి స్థాయి సామర్థ్యం 123.081 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 98.859 టీఎంసీలుగా నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు