జగన్‌ ఆలోచనతో స్వయం సహాయక మహిళలకు ఉపాథి

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:05 IST)
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆలోచన కరోనా వైరస్‌నుంచి ప్రజలను రక్షించే చర్యలు బలోపేతం అవ్వడమే కాకుండా, విపత్తు కాలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధినిస్తోంది.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీచేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా... విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.

స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను సీఎం తన నివాసంలో ప్రారంభించారు. మహిళలు తయారుచేసిన మాస్క్‌లను మెప్మా అధికారులు సీఎంకు అందజేశారు. 
 
కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రజలకు ప్రతి ఒక్కరికి మూడు చొప్పున మాస్కులు పంపిణీచేయాలని సీఎం నిర్ణయించారు. వైరస్‌ వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ఈ మాస్కులు ఇవ్వాలని సీఎం నిశ్చయించారు.

మాస్క్‌ల తయారీని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

దీనికి అవసరమైన క్లాత్‌ను ఆప్కోనుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 16 కోట్ల మాస్కులు తయారుచేయడానికి 1 కోటి 50 లక్షల మీటర్లకుపైగా క్లాత్‌ అవసరం అవుతోంది. 

ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కోనుంచి తీసుకున్నారు. మిగతా క్లాత్‌ త్వరలోనే అందబోతోంది. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40వేల మంది టైలర్లను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన వారితో పనిచేయిస్తున్నారు.

ఒక్కో మాస్క్‌కు దాదాపు రూ.3.50 చొప్పున సుమారు రూ.500లకుపైనే ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్క్‌లు తయారుచేయగా వీటిని పంపిణీకోసం తరలిస్తున్నారు.

వచ్చే 4–5 రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్క్‌లు తయారీకోసం సన్నద్ధమవుతున్నారు. మాస్క్‌ల తయారీ, పంపిణీలపై వివరాలతో కూడా రియల్‌టైం డేటాను ఆన్‌లైన్లో పెడుతున్నారు.

స్వయంసహాయక సంఘాలు తయారుచేసిన ఈ మాస్క్‌లను సీఎం వైయస్‌.జగన్‌ తన నివాసంలో ప్రారంభించారు. సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్, అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు