తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైనా పిల్లలు లేరు.. భార్య గర్భం దాల్చడంతో.. మామిడి తోటలో..?

శుక్రవారం, 14 మే 2021 (17:20 IST)
భర్త అనుమానం ఓ వివాహిత ప్రాణాలను బలిగొంది. తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయినా ఆ దంపతులకు పిల్లలు కలగలేదు. నాలుగు నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో ఆ భర్తలో అనుమానం మొదలైంది. తన భార్య తప్పు చేసిందని.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మూలంగానే ఆమె గర్భం దాల్చిందని భావించాడు. భార్యను తనతో పాటు పొలానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. నందలూరు మండలం టంగుటూరు హరిజనవాడకు చెందిన నరసయ్యకు, లక్ష్మమ్మకు తొమ్మిది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా ఈ దంపతులకు సంతానం కలగలేదు. అయినా ఆమెకు భర్త అండగా నిలిచాడు. 
 
అయితే.. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది. ఇన్నేళ్లుగా గర్భం దాల్చని లక్ష్మమ్మ ఇప్పుడు గర్భం దాల్చడం ఏంటని నరసయ్య, అతని తరపు వారంతా వేధించసాగారు. నరసయ్యలో అనుమానం మొదలైంది. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. 
 
ఆమె తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఎవరితో వివాహేతర సంబంధం నడుపుతున్నావో చెప్పాలని, కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని నరసయ్య లక్ష్మమ్మతో గొడవ పెట్టుకునేవాడు. భార్య నిజం చెప్పడం లేదని భావించిన నరసయ్య ఆమెను అంతమొందించాలనుకున్నాడు.
 
మామిడి తోటలో గర్భవతి అయిన భార్యను హతమార్చాడు. లక్ష్మమ్మ తలపై, గొంతుపై దాడి చేసి ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. తమ కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో లక్ష్మమ్మ తల్లిదండ్రులకు అనుమానమొచ్చి నరసయ్యను నిలదీశారు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటంతో అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ మృతదేహాన్ని మామిడి తోటలో గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం లక్ష్మమ్మ మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు