మరికొన్ని గంటల్లో పెళ్లి... పారిపోయేందుకు యత్నం.. పట్టుకుని పెళ్లి చేశారు.. ఎక్కడ?

గురువారం, 4 మే 2023 (12:15 IST)
వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో ముహూర్తం జరగాల్సివుంది. ఇంతలో వరుడు పెళ్ళి మండపం నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు పట్టుకుని పెళ్లి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుత్బుల్లాపూర్‌ కుర్మబస్తీకి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పెద్దలకు తెలియకుండా ఫిబ్రవరి 19న అల్వాల్‌లోని ఆర్య సమాజ్‌లో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇది ఇరు కుటుంబాలకు తెలియడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకొన్నారు. దీంతో బుధవారం ముహూర్తం పెట్టుకున్నారు. 
 
మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం రాత్రి నుంచే యువకుడి ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. స్నేహితులు, తెలిసిన వారి దగ్గర విచారించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో రాత్రి 11 గంటలకు పెళ్లిదుస్తులతో యువతి జీడిమెట్ల పోలీసుల్ని ఆశ్రయించింది. 
 
వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ ఎం.పవన్ నాలుగుగంటల్లో ఆచూకీ గుర్తించారు. అతనితో మాట్లాడి కౌన్సెలింగ్‌ చేశారు. వారు పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లి జరగడంతో స్థానికులు పోలీసులను అభినందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు