ఆ యాప్‌లో యువతులతో పరిచయం.. బ్లాక్ మెయిల్.. పెళ్లైనా వదలడు..

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:06 IST)
మహిళలపై అకృత్యాలు ఓవైపు.. అఘాయిత్యాలు, మోసాలు మరోవైపు జరుగుతూనే వున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా యువతులతో పరిచయం చేసుకుని డబ్బు కోసం వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువ ఇంజనీర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాదొడ్డి అబ్దుల్లా (35) వృత్తిరీత్యా ఇంజనీర్‌. 
 
ఇతడు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఓ డేటింగ్‌ యాప్‌లో డాక్టర్‌ కార్తీక్‌రెడ్డిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంకా డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతితో యాప్‌లో ఇతనికి పరిచయం అయింది. అప్పటికి వైద్య విద్య అభ్యసిస్తున్న ఆమెతో అబ్దుల్లా తరచూ చాటింగ్‌ చేసేవాడు. కొన్నాళ్ల తరువాత ఇద్దరూ బయట కలుసుకునే వారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియోలు అబ్దుల్లా భద్రపరిచాడు. 
 
కొన్నాళ్ల తర్వాత ఆ యువతికి పెళ్లయి పోవడంతో తనతో చాటింగ్‌ చేయడం మానేయాలని కోరింది. ఇదే అవకాశంగా తీసుకున్న అబ్దుల్లా ఆ ఫొటోలు, వీడియోలు చూపి ఆమెను బెదిరించాడు. వాడి వేధింపులు తాళలేక ధైర్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇప్పటికే అతని బెదిరింపులకు భయపడి పలు ధపాల్లో నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని అబ్దుల్లాను అరెస్టు చేసి కటాకటాల వెనక్కి పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు