పెళ్లికాని యువకులే టార్గెట్... వలపు వలతో రూ.లక్షలకు కుచ్చుటోపి

శనివారం, 9 నవంబరు 2019 (10:43 IST)
పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని ఓ మహిళా లాయర్ లక్షలాది రూపాయలను దోచుకుంది. ఓ యువతిని హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హైదరాబాద్, మలక్‌పేటకు చెందిన షాదాన్‌ సుల్తానా అనే యువతి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా పనిచేస్తోంది. 2015లో ఆమెకు అబిడ్స్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా కలిసి తిరిగే వరకు వెళ్లింది. 
 
ఈ క్రమంలో తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెడతానని రహీంను బెదిరించిన ఆమె అతడి నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసింది. ఆరు నెలల క్రితం రహీంను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేసిన సుల్తానా.. తాజాగా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. 
 
ఆమె బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన రహీం గత నెల 19న తన కార్యాలయ సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు అతడిచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
 
ఆ తర్వాత ఆమె వద్ద జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె చేతిలో మోసపోయిన వారి జాబితా చాంతాడంత ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 2014 నుంచే ఇటువంటి మోసాలకు ఆమె పాల్పడుతున్నట్టు తేలింది. ప్రేమ పేరుతో గతేడాది ఏకంగా 14 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, మోసపోయిన వారి జాబితాలో ఓ యువ లాయర్ కూడా ఉన్నట్టు తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు