హైదరాబాద్ నేరేడ్మెట్లో అక్కాచెల్లెళ్ళ ఆత్మహత్య హత్య కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌనిక ప్రేమించి ప్రియుడు.. కులాలు వేరని, కట్నంరాదని భావించి మరో అమ్మాయిని ప్రేమించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు ప్రేమ పేరుతో మౌనికను వేధంచసాగాడు. ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. అలాగే, తండ్రిలేని సౌమ్య రాజేశ్వరి కూడా తన బంధువులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే...
వాయుపురి రోహిణి కాలనీలో నివసిస్తున్న కె.నాగార్జున అనే యువకుడు బీటెక్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అదేకాలనీలో ఉంటున్న మౌనిక (20) బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, ఇద్దరి కులాలు వేరవడం.. కట్నం రాదని మరో యువతితో నాగార్జున పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల టవర్ నివాసి, ఫొటో గ్రాఫర్ గొల్లకోట బాలకామేశ్వరరావు అలియాస్ కామేష్ మౌనికకు దగ్గరయ్యాడు. మనిద్దరిది ఒకే కులమనీ... పెళ్లి చేసుకుంటానని మౌనికను కామేష్ నమ్మించాడు.
ఆ తర్వాత మే 25వ తేదీన 20 రూపాయల బాండు పేపరు కొనుగోలు చేసి తన స్నేహితుడు మౌలాలితో కలిసి మౌనిక ఇంటికెళ్లి, నాగార్జునతో ఏ సంబంధం లేదని దానిపై ఆమెతో బలవంతంగా రాయించారు. కామేష్ సాక్షి సంతకం చేశాడు. అప్పటినుంచి మౌనిక, కామేష్ కలిసి తిరుగుతున్నారు. అయితే, మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టంలేని నాగార్జున.. మౌనిక వద్ద తన బాధను వెళ్లగక్కాడు. ఈ విషయం కామేష్కు తెలియడంతో నాగార్జునపై ద్వేషం పెంచుకున్నాడు.
ఇదిలావుండగా, మౌనిక చిన్నమ్మ కుమార్తె సౌమ్య రాజేశ్వరి కొత్తపేటలోగల ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. 20 రోజుల క్రితం మౌనిక ఇంటికి వచ్చింది. క్యాన్సర్ వ్యాధితో తల్లిదండ్రులను కోల్పోయిన సౌమ్య... తన బాధను మౌనిక వద్ద వాపోయింది. అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి ఈనెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చనిపోవటానికి కారణాలను వేర్వేరుగా లెటర్లు రాసి ఆర్కేపురం చెరువులో దూకి మృతిచెందారు. తన చావుకు కారణం కామేష్ వేధింపులేనని.. అతడిని విడిచిపెట్టొద్దని మౌనిక లెటర్లో రాసింది. అలాగే, బంధువుల వేధింపులు భరించలేక చనిపోతున్నట్టు సౌమ్యరాజేశ్వరి సూసైడ్ నోట్ రాసింది.