పదవి కోసం సీఎం జగన్‌ను అడుక్కోను... పిలిచి ఇస్తే తీసుకుంటా... పోసాని

బుధవారం, 31 జులై 2019 (19:25 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. మీడియాతో పోసాని తాజాగా చేసిన మాటామంతి మళ్లీ చర్చనీయాంశమైంది. వైసిపి కోసం తనవంతు ఉడతాభక్తి సాయం చేశాననీ, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని చూడాలన్న ఆకాంక్ష నెరవేరిందని చెప్పుకొచ్చారు.
 
జగన్ మోహన్ రెడ్డిని తను గత తొమ్మిదేళ్లుగా బాగా ఫాలో అవుతున్నాననీ, ఇండియాలో వున్న నాయకుల్లో బెస్ట్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని పొగడ్తల జల్లు కురిపించారు. వైసీపిలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లినవారిలో ముందువరసలో తనతో పాటు రోజా వున్నట్లు చెప్పారు. తనకంటే వెనక వచ్చినవారికి పదవులు దక్కడంపై ప్రశ్నించగా దానికి సమాధానమిచ్చారు.
 
తనుగా ఎప్పుడూ ఎవరినీ అడుక్కోలేదన్నారు. సినిమా పాత్రల విషయంలో కూడా తను ఎవర్నీ అడుక్కోకుండానే వచ్చాయన్నారు. అలాగే సీఎం జగన్ గారిని తను పదవి కోసం అడుక్కోనని అన్నారు. ఐతే ఆయన పిలిచి ఏ పదవి ఇచ్చినా చేసేందుకు సిద్ధమేనన్నారు. ఇక తన కంటే జూనియర్లకు పదవులు రావడం అనేది... వారు తనకంటే ఎక్కువ పనిచేసి వుండొచ్చని అభిప్రాయపడ్డారు. మరి.. పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అడక్కుండా ఏ పదవైనా ఇస్తారా... చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు