మంత్రిమండలిని రద్దు చేసి రాజీనామా చేస్తానన్న సీఎం జగన్!

మంగళవారం, 8 మార్చి 2022 (07:39 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోపమొచ్చింది. తన మంత్రిమండలిని రద్దు చేసి తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. సీఎం జగన్ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడారో ఓసారి పరిశీలిద్ధాం. 
 
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించారు. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. పైగా, గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేశారు. 
 
వెల్‌లోకి దూసుకెళ్లి రభస సృష్టించారు. ఈ చర్యలపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశం జరిగింది. సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం జగన్‌తో పాటు.. ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ విప్, టీడీపీ తరపున అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడును ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, చరిత్రలో ఇలా ఎపుడూ జరగలేదు. మీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా వుందన్నారు. దీనికి అచ్చెన్నాయుడు కూడా ధీటుగా సమాధానమిచ్చారు. గతంలోనూ మీరూ ఇదే పని చేశారన్న సంగతిని గుర్తు తెచ్చుకోండి అంటు బదులిచ్చారు. 
 
నేను చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాను. మంత్రి మండలిని కూడా రద్దు చేస్తా అని జగన్ అన్నారు. అయితే, గవర్నర్ ప్రసంగాన్ని నిరసన తెలపడం అనేది ఇదే మొదటిసారి కాదు అని అచ్చెన్నాయుడు మళ్లీ సమాధానమిచ్చారు. దీనికి జగన్ బదులిస్తూ మేమెప్పుడూ అలా చేయలేదు. చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తాను అని మరోమారు స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు