విజయవాడలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌

శుక్రవారం, 9 జులై 2021 (11:09 IST)
విజయవాడలో భారీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆటోనగర్‌లోని ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌ను ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌గా అభివృద్ధి చేయటానికి అడుగులు పడ్డాయి. విజయవాడలో అతిపెద్ద పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) ఉండటంతో నగరంలోని బస్‌ డిపోల మీద ఇప్పటి వరకూ అంతగా దృష్టి సారించలేదు.

ఆటోనగర్‌లో మినహా ఇతర డిపోలకు బస్‌ టెర్మినల్స్‌ లేవు. ఆటోనగర్‌ టెర్మినల్‌ బందరు రోడ్డు వెంబడి ఉంది. ఆర్టీసీ బస్సులకు అత్యంత కనెక్టివిటీ ఉన్న డిపో ఇది. ఈ డిపో, టెర్మినల్‌ మొత్తం రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మిస్తే, కమర్షియల్‌గా కూడా లాభపడవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. ప్రస్తుత బస్‌ టెర్మినల్‌ స్థానంలో రెండెకరాల విస్తీర్ణంలో భారీ బహుళ అంతస్థుల సౌధాన్ని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంతా బస్‌ టెర్మినల్‌కు, అండర్‌ గ్రౌండ్‌ను డిపోకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఎన్ని అంతస్థులు నిర్మించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. హైరైజ్‌ భవనం నిర్మిస్తే భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నది ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆలోచన.

ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావటంతో ఉన్నతాధికారులు దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు