ఎన్‌పీఆర్‌పై జగన్‌ డ్రామాలు: చంద్రబాబు

గురువారం, 5 మార్చి 2020 (06:07 IST)
జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనలో ఉన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

గడిచిన 9 నెలల్లోనే మైనార్టీల్లో అభ్రతాభావం పెరిగిందని, వీటి అమలుపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుతో ముస్లిం సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. ఎన్‌పీఆర్‌పై ప్రజల్లో ఆందోళనల దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రస్తుతానికి అబయన్స్‌లో పెడుతున్నామంటూ కేబినెట్‌లో ఆమోదించడమూ జగన్నాటమేనని అన్నారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై జీవో 102ను ఆగస్టు16న విడుదల చేసే వారే కాదని, దీనిని నమ్మడానికి ముస్లింలు సిద్ధంగా లేరని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్లకోసం జగన్‌ నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. టీడీపీ తెచ్చిన ముస్లిం సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భేటీలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ వ్యతిరేక కూటమి ఏపీ శాఖ, జమాతె ఇస్లామి హింద్‌, ముస్లిం హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు