జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దామనుకున్నాడు: దేవినేని సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం, 29 జనవరి 2021 (10:27 IST)
పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పుతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచన చేశాడని, ఇంటిలిజెన్స్‌ నివేదికల ద్వారా ప్రజావ్యతిరేకత తెలుసుకొని తోక ముడిచాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ర్యాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు సుప్రీం తీర్పు ద్వారా ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ముఖ్య నాయకులతో తాడేపల్లి రాజప్రసాదంలో సమావేశమైన జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించినట్టు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగు గంటల పాటు మల్లగుల్లాలు పడి నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరినట్టు తెలిపారు. ఆ సమయంలోనే ఇంటిలిజెన్స్‌ నివేదికను తెప్పించుకున్న జగన్‌ తన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలుసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు చెప్పారు.
 
ఏ క్షణంలో ఎన్నికలకు వెళ్లినా వైసీపీకి సింగిల్‌ డిజిట్‌ సీట్లు కూడా రావన్న సమాచారంతోనే ఆయన రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలిపారు. ప్రజావ్యతిరేకత సమాచారం తెలుసుకున్న ముఖ్య మంత్రి ఖంగుతిని తన నైజానికి విరుద్దంగా ఎన్నికల కమిషన్‌కు సహకరిస్తామని ప్రకటించినట్టు తెలిపారు.

మరుసటి రోజే తన సహజనైజాన్ని వెలికితీసిన జగన్‌ ఎన్నికల కమిషన్‌పై విషం కక్కుతున్నాడన్నారు. ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఐఅండ్‌పీఆర్‌ ద్వారా ఏకగ్రీవాలపై పలు పత్రికలలో భారీ ప్రకటనలు ఇప్పించినట్టు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనేని అన్నారు.

రాజ్యాంగ బద్ద పదవులలో ఉన్న స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కమిషన్‌పై చేస్తున్న వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని వారిపై రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు