ఆ గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేయండి: సీఎం జగన్

గురువారం, 28 జనవరి 2021 (22:55 IST)
పశ్చిమ‌గోదావ‌రి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రఖ్యాత సంస్థల పరీక్షలు, వాటి ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సురక్షితమంటూ పరీక్షా ఫలితాలు వచ్చాయని.. దీంతోపాటు  పూళ్లలో ఆహార పదార్థాలు కూడా సురక్షితమేన‌ని కూడా ఫ‌లితాలు వచ్చాయని అధికారులు ముఖ్య‌మంత్రి జగన్‌కు వివరించారు.  
 
కొమరవోలులో ఆహార పదార్థాలపై పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని  అధికారులు సీఎం జ‌గ‌న్‌కు వెల్ల‌డించ‌గా ప్రజలు అస్వస్ధతకు గురైన గ్రామాల్లో ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ విజయవంతమైన చిన్నారులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు పరిచయం చేశారు.
 
ఆపరేషన్‌ అనంతరం చిన్నారుల ఆరోగ్యం ఎలా ఉందంటూ పిల్లల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎ.మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు