నల్లగా ఉన్నవారు మంచివారు కాదా? కచ్చితంగా వివక్ష ఉంది.. భారతీయులంతా?: జేసీ

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (17:21 IST)
నల్లగా వున్న దక్షిణ భారతీయులతో కలిసివుంటున్నామని భారత దేశంలో జాతివివక్షకు చోటేలేదని.. బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఇంకా తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దక్షిణ భారతీయులపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన తరుణ్ విజయ్‌పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి.
 
మరోవైపు తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణాది వారి నలుపు రంగు గురించి తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. హిందీ ప్రజలు, హిందీయేతర ప్రజలు అనే వివక్ష కచ్చితంగా ఉందని జేసీ గుర్తు చేశారు. తన ఊరు, తన ప్రాంతం, తన జిల్లా అనే భావనలతోనే ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయని.. భారతీయులంతా ఒకటే అనే భావంతో మెలగాలన్నారు. 
 
తెల్లగా ఉన్నవారు మంచివారు, దార్శనికులు... నల్లగా ఉన్నవారు మంచివారు కాదనుకుంటే ఎలాగని జేసీ మండిపడ్డారు. ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిత్వాన్నైనా రంగుతో నిర్ణయించడం మంచిది కాదని జేసీ కామెంట్స్ చేశారు.

వెబ్దునియా పై చదవండి