విజయవాడ: అధికార పార్టీ అని ఎన్నో ఆశలతో టీడీపీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి జాలిగా తయారైంది. వైసీపీలో ఉన్నపుడు పాముల్లా బుసలు కొట్టిన నేతలు... ఇపుడు తెదేపా కండువాలు కప్పుకుని, కోరలు పీకిన పాముల్లా మారిపోయారనే కామెంట్లు వినబడుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు అధినేత, ఆయన కుమారుడు లోకేష్ యువ నేత... వీరిద్దరినీ కాదని ఏ పనీ కాదు... పైగా ఒక్కమాట కూడా మీరడానికి వీలులేదు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఇపుడు ప్రత్యేకంగా తాము కోరుకున్న ఏపనీ జరగడం లేదు. దీనితో అధికార పార్టీకి వచ్చి వెలగబెడుతున్నది ఏముందనే మీమాంశలో పడుతున్నారట.
ఇరవై మoది వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రి పదవుల కోసం, కొంతమంది తమ అభివృధి, భవిష్యత్ అంటూ టీడీపీలో చేరారు. అధికార పార్టీలో చేరితే, తమ జాతకాలు మారతాయి అని ఆవేశపడి జంప్ చేశారు. అయితే అనుకున్నది ఒకటి, అయిందొకటి ... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సామెతలా తయారయింది వీళ్ళ పొజిషన్. కనీసo ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమ గోడు చెప్పుకొందామన్నా, బాబు గారి అపాయింట్మెంట్ దొరకడం లేదట.
పాత ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జిలు జనచైతన్య యాత్రలంటూ హడావుడి చేస్తున్నారు. కొత్తగా వచ్చినవారిని దూరం పెడుతున్నారు. లోకల్గా వేరు కుంపటి పెట్టి...అసమ్మతి రాజేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలకు కనీస విలువ లేకుండా పోయింది. అంతా జిల్లాల ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జుల హవా కొనసాగుతోంది.
తెదెపాలో చేరితే మంత్రి పదవులు వస్తాయని బాగా ఆశపడ్డ భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ, చాoద్ బాషా, సుజయకృష్ణ రంగారావు, శివ రామ రాజులకు ఇప్పటివరకు ఆ ఊసే లేదు. పైగా ఇపుడు ఈ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం వెంటాడుతోంది. హాయిగా వైసీపీలోనే కొనసాగినట్లయితే నియోజకవర్గంలో గర్వంగా ప్రజల ముందు తల ఎత్తుకొని ఉండే వాళ్ళo... జంప్ చేసి అనవసరంగా తప్పు చేసాం... అని కొందరు ఎమ్మెల్యేలు తెగ బాధపడిపోతున్నట్లు తాజా సమాచారం. ఇందులో కొందరు రిటన్ ఆఫ్ ది వైసీపీకి కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.