అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

దేవీ

సోమవారం, 21 జులై 2025 (14:07 IST)
Harihara team with pawan
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. 
 
Pawan pressemet at Park Hayat
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాటపడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎ.ఎం. రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే.. ఈవెంట్ తర్వాత మళ్ళీ మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం రాదేమో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు. "ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది". అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం గారి తపన చూశాను. 
 
ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్ కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను. ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్ కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్ తో కూర్చొని క్లైమాక్స్ ను ప్రత్యేకంగా రూపొందించాము. సినిమాకి ఇదే ఆయువుపట్టు. 
 
సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. నేను ఎ.ఎం. రత్నం గారిని దగ్గరనుండి చూశాను.
 
 ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయనతో మాట్లాడుతుంటే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి గారు. నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప.. సినిమా గురించి పెద్దగా మాట్లాడను. కానీ, ఈ సినిమాకి మాట్లాడటం అవసరం అనిపించింది. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. 
 
ఇక్కడ ఎందరో మీడియా మిత్రులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం గారి లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని.. ఈ సినిమాని నేను నా భుజాలపైకి తీసుకున్నాను. రత్నం గారు, జ్యోతికృష్ణ గారు, మనోజ్ పరమహంస గారు నిద్రలు మానుకొని మరీ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అలాగే నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమా అనాధ కాదు.. నేనున్నాను అని చెప్పడానికి వచ్చాను ఈరోజు. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని, దేశంలో ఉన్న సమస్యలకు స్పందించేవాడిని.. అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను. ఒక చిన్న మేకప్ మ్యాన్ స్టార్ట్ అయ్యి.. దర్శకుడిగా, రచయితగా, నిర్మతగా అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు రత్నం గారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన మౌనంగా ఉంటారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. అందుకే సినీ పరిశ్రమ అంటే నాకు అంత గౌరవం. సినిమా చేయడం అనేది ఒక యజ్ఞం లాంటిది. డబ్బులు మిగులుతాయో లేదో కూడా తెలీదు. రత్నం గారు మంచితనం గురించి, ఆయన చేసిన మంచి సినిమా గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేశారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ ని ఎలా చేయబోతున్నామో జ్యోతికృష్ణ ముందే ప్రీ విజువలైజ్ చూపించారు. 
 
ఆయన సత్తా ఉన్న దర్శకుడు. సాంకేతిక విభాగాల మీద మంచి పట్టుంది. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడయ్యారు. రత్నం గారి అనుభవంతో వీరిద్దరూ కలిసి సినిమాని గొప్పగా మలిచారు. నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా అనేది మా జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.
 
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ,  వన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన ఒక ఫైట్ ఉంది. ఆ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ లోనే ఒక కథ ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ కి కీరవాణి గారికి సంగీతం చేయడానికి పది రోజులు పట్టింది. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే.. పవన్ గారు చూసే వీరమల్లు వేరే. పవన్ గారు అనుకున్న సినిమా వేరే. ఆయనలో ఉన్న ఫైర్ లో నుంచి డిజైన్ చేసిందే 'ధర్మం కోసం యుద్ధం'. 17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఈ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నేను ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోలేదు. మా నాన్న ఎ.ఎం.రత్నం గారి కసి, పవన్ గారి కళ్ళలోని ఫైర్.. నన్ను అలా అవిశ్రాంతంగా పనిచేసేలా చేశాయి. నాతో పాటు నా టీం అంతా నిద్ర కూడా మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కీరవాణి గారు, మనోజ్ పరమహంస గారి సపోర్ట్ ను మర్చిపోలేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తెరమీద ఎలా చూడాలని ఎదురుచూస్తున్నామో.. ఆ కోరిక హరి హర వీరమల్లుతో నెరవేరనుంది. జూలై 24న అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను." అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు