పెళ్లి జరిపే స్థోమత లేదు.. మెరుగు పెట్టే రసాయనం తాగి ముగ్గురు ఆత్మహత్య

గురువారం, 10 డిశెంబరు 2020 (09:54 IST)
పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం.. పెళ్లి చేసేదెలా? అని కుంగిపోయింది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఈ ఘటన ఖమ్మంలో విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో ఓ కుటుంబంలో నివాసం ఉంటుంది.. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. జనవరి 11న వివాహం నిర్వహించాల్సి ఉంది. తండ్రి ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుండగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 
 
కట్నం లేకుండా వివాహానికి సిద్ధం అయ్యారు.. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు పుట్టని పరిస్థితి నెలకొంది.. వివాహం దగ్గర పడటం, డబ్బులు లేకపోవడంతో కలతచెందారు. 
 
బుధవారం రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి.. తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29), రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి ఇంట్లో అంతా మృతిచెంది ఉండడంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు