ఎన్నికల ముందు ముద్దులు ..ఇప్పుడు పిడి గుద్దులు: చంద్రబాబు

మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:04 IST)
వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. యువనేస్తం ఎందుకు రద్దు చేశారు? అని ప్రశ్నించారు. సన్నబియ్యం అడ్రస్‌లేదు, పెళ్లి కానుక ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగన్‌ ఎన్నికల ముందు ముద్దులు పెట్టి..ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. 
 
టీటీడీ చైర్మన్‌ చేతకాని తనం వల్ల బస్సు టికెట్లు, వెబ్‌సైట్లలో అన్యమత ప్రచారం జరుగుతుందన్నారు. ‘‘స్పీకర్‌ మాటలు రాజ్యాంగ విరుద్ధం..వైసీపీ కార్యకర్తల కోసం బార్లను రద్దు చేశారు’’ అని వ్యాఖ్యానించారు. 
 
బిల్డ్‌ ఏపీ మిషన్‌ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మితే చివరకు ఏమీ మిగలదని చెప్పారు. అవినీతి తవ్వుతున్నామన్నారు.. ఏం తీశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
 
శంషాబాద్ లో  ఇటీవల చోటు చేసుకున్న జస్టిస్ ఫర్ దిశ  వ్యవహారం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, నేరస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
శంషాబాద్ లో జరిగిన దారుణంతో పాటు షాద్ నగర్ లో దిశ మృత దేహాన్ని దహనం చేసిన విషయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ బైపాస్ రహదారిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వెళ్తూ కాసేపు కాన్వాయిని రోడ్డుపై ఆపారు. ఈ సందర్భంగా ఆయనను కార్యకర్తలు కలుసుకున్నారు.

అక్కడ హాజరైన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. శంషాబాద్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్న లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్ష పడే విధంగా చూడాలన్నారు.  
 
అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు.

ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతరం ఆయన కర్నూలు పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు నాయుడు షాద్ నగర్ బైపాస్ ప్రాంగణంలో చేరుకోవడంతో కార్యకర్తలు జై తెలుగుదేశం నినాదాలు చేశారు. తమ నాయకుడిని కళ్లారా చూసుకొని కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు