టీడీపీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం ప్రారంభం

శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:29 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు పథకం పెండింగ్ బిల్లులకు సంబంధించిన బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు – చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1,277 కోట్లు సీఎఫ్ఎంఎస్ లో టోకెన్ పడి పెండింగ్ లో ఉన్నాయి.

ఇవి కాక మరో రూ.500 కోట్ల వరకు జనరేట్ కాని బిల్లులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దేశంలోని తొలిసారిగా నీరు – ప్రగతి కింద చిన్న నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల నుంచి రూ.18,265 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు, కాలువల పూడికతీత, పంట కుంటల నిర్మాణం, చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువులు తదితర నీటి సంరక్షణ చర్యలు చేయడం వలన 98 కోట్ల ఘనపు మీటర్ల పూడిక మట్టిని తొలగించడం వలన 90 టీఎంసీలు భూగర్భ జలాలుగా మార్చబడి రాష్ట్ర వ్యాప్తంగా 6.795 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా స్థిరీకరించబడింది.

అప్పటి ప్రభుత్వానికి దీని వలన 9 మెరిట్ స్కాచ్ అవార్డులు వచ్చాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా సన్న, చిన్న కారు రైతులు నీటి సంఘాల ప్రతినిధులు చేసిన పనులను నిలిపివేయడం వలన పనులు చేసిన వాళ్లు అప్పులు పాలయ్యి రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు - చెట్టు బిల్లులకు సంబంధించిన ఫిర్యాదు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఫిర్యాదుల విభాగం పరిష్కారానికి తోడ్పడుతుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా నీరు - చెట్టులో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆఖరి రూపాయి అందే వరకు ఈ విభాగం పని చేస్తుందని, పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు 9848151300, 8074090252, 9848153588, 9849393194 నెంబర్లతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నారా చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదారవిచంద్ర యాదవ్,  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రేపల్లే శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర సాగు నీటి సంఘాల వినియోగదారుల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, మాజీ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ మైనేని మురళీ కృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, నీరు – చెట్టు రాష్ట్ర కో – ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కవులూరి రాజా, చెన్నుపాటి శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు